తిత్లీ తుఫాన్ -నిజానిజాలు

తిత్లీ తుఫాన్ లో బాబు,లోకేష్ మంత్రుల హడావుడి వల్ల అసలు సహాయ పనులు జరగడం లేదు .
-ఎ.అజ శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి
ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తిత్లీ తుఫాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తీవ్రంగా నష్ట పరిచింది.
తుఫాను ప్రభావిత అన్ని ప్రాంతాలలోనూ గాలికి విద్యుత్‌ స్తంభాలు పడిపోయి, కరెంటు సరఫరా ఆగి పోయింది. వరద నీరు చేరి, మంచి నీళ్ళు దొరకడం లేదు. కరెంటు, నీళ్ళు లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వయంగా ముఖ్య మంత్రి గారు శ్రీకాకుళం జిల్లా, పలాస ప్రాంతంలోనే ఎక్కువ దృష్టి పెట్టారు.

సహాయక చర్యలకై ముఖ్యమంత్రి గారు ఆ మరునాడే పలాసకు చేరారు. హెలీకాప్టరులో పరిశీలించారు. అన్నీ సర్దుకునే దాకా అక్కడే ఉంటా నని తెలిపారు. అనేక మంది మంత్రులను రంగంలోకి దింపారు. ప్రజలకు ఉపశమన చర్యలకై 37 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లను, 92 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు దింపి సహాయ చర్యలు చేపడతామని ప్రకటించారు. ఒక్కో మండల పర్యవేక్షణకై ఇద్దరు లేదా ముగ్గురు ఐఎఎస్‌ అధికారులను నియమించారు. అయితే సాధారణ పరిస్థితులు వచ్చేదాకా అక్కడే ఉంటానన్న ఆయన మూడు రోజులు గడవక ముందే దుర్గమ్మ పూజలకు విజయవాడ పయనమయ్యారు.

కొత్త సమస్య
ఈ లోగా ఈ ప్రాంతంలో ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అదేమిటంటే మంత్రులు, అధికారుల తాకిడి బాగా పెరిగింది. వీరు విశాఖ వరకు విమానంలో వచ్చి రోడ్డు మార్గంలో పలాసకు బయలు దేరడంతో విశాఖ, శ్రీకాకుళం రోడ్డు రద్దీ బాగా పెరిగింది. ప్రతి మంత్రికి కనీసం మరో మూడు కాన్వారు వాహనాలు, పోలీసు జీపులతో ఆ ప్రాంతం ఏనాడూ లేని కొత్త శోభను తెచ్చుకుంది. వీరు కాక కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పలాస బాట పట్టారు. ఇంత మంది రావడం మామూలుగా అయితే చాలా మంచిదే. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్‌గా పని చేస్తోందని అర్థం. ఇది ఒక కోణం నుండి.

కానీ అసలు సమస్య ఇంత మంది రాక వల్లే ప్రారంభమైంది. అదెలాగంటే మంత్రులు వస్తే వారికి ప్రోటోకాల్‌ ప్రకారం అన్ని వసతులు స్థానిక అధికారులు కల్పించాలి. పోలీసులు వీరికి ఎస్కార్ట్‌ కల్పించాలి. వసతి, ఆహార ఏర్పాట్లకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలి. అనేక మంది పెద్ద పెద్ద అధికారులు, వివిధ శాఖల అధిపతులు రావడంతో ఆయా శాఖల సిబ్బంది, వీరికి కావలసిన సేవలు చేయాలి. అయితే వీరి సేవకు సమయం కేటాయించడమా లేక ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడమా అన్నదే ఇప్పుడు సిబ్బంది ముందు వున్న సమస్య. ఒక సమయంలో ఒకే పని చేయగలరు. అప్పుడు దేన్ని ఎంచుకోవాలి? మంత్రులను, ఉన్నతాధికారులను వదిలేసి ప్రజల సేవకు పోతే మంత్రుల దృష్టిలో వీరికి చులకనయ్యే అవకాశం ఎక్కువ. సహజంగానే మంచి మార్కులు కొట్టేయడానికి, మంత్రుల కనుసన్నల్లో పడడానికే స్థానిక అధికారులు నిమగమయ్యారు.

ఫలితం శూన్యం
తుఫాను ముగిసి వారం రోజులు గడిచినా అందరూ కేంద్రీకరించిన పలాస పట్టణంలోనే ఇప్పటికీ అత్యధిక ప్రాంతాలలో కరెంటు పునరుద్ధరించబడ లేదు. ఎక్కడా మంచి నీరు అందడంలేదు. ప్రభుత్వ సహాయక చర్యలు, కనీసం ఆహార సరఫరా కూడా మండల కేంద్రాలలోని ప్రజలకు చేరడం లేదు. ఇక మిగిలిన గ్రామాలు, ప్రాంతాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సహాయానికై కనపడిన వారందరిని ప్రాధేయపడే దీన స్థితిలో అక్కడి ప్రజలు ఉన్నారు.

ముఖ్యమంత్రి, వారి తనయుడుతో సహా మంత్రు లందరినీ ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. వీరి వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇది ఎంత తీవ్రంగా ఉందంటే, సీఎం సహనం కోల్పోయి, నిలదీస్తే బుల్డోజర్లతో తొక్కించేస్తానని ప్రజలను హెచ్చరించే స్థాయికి చేరింది.

పోలీసుల పని ప్రజల నుండి మంత్రులను కాపాడడంతోనే సరిపోతోంది. ఇక ప్రజలకు ఏం చేస్తారు?

మంత్రులందరూ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎఎక్కువ రోజులు ఇక్కడే ఉంటున్నారు. ప్రజలలోకి వెళితే ఎదురీత కాబట్టి ఏదో కాలక్షేపం చేస్తున్నారు.

ఇక ఉన్నతాధికారులు తమ మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయడానికి యథా రాజా తథా ప్రజ. ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడానికి తమ వద్ద ఉన్న దొంగలెక్కల విద్యతో అంతా బావుందని రిపోర్టులు తయారు చేసేస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి గారైతే ఎన్నికలలో మొత్తం రాష్ట్ర ప్రజలందరి మార్కులు హోల్‌సేల్‌గా లాగేసుకోవడానికి అన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు. అధికారులను హూంకరిస్తున్నారు. అన్నీ సరి చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు.

సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం 2014 లో హుదూద్‌ తుఫాన్‌ సమయంలో ఈ ముఖ్య మంత్రి గారే ఎంతో హడావుడి చేసి… అంతా సరి చేసేసానని తనకి తానే గొప్పలు చెప్పుకోవడం చూశాం. కానీ నాలుగు సంవత్సరాలు దాటినా నేటికీ హుదూద్‌ పరిహారమందని మత్స్య కారులు ఎందరో ఉన్నారు. అనేక ఇళ్లకు నేటికీ నష్ట పరిహారం అందలేదు.

నేడు తిత్లీ తుఫానులో ఎన్నికల సంవత్సరం కాబట్టి అంత కంటే ఎక్కువ హడావుడే చేస్తున్నారు. అయితే హడావుడి, ఆలస్యం తప్ప తుఫాను సహాయం మాత్రం కనీస స్థాయిలో కూడా జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం హడావుడి మాని ప్రజలకు అందే సేవలపై దృష్టి సారించడం మంచిది.

Source–‘హడావుడి – ఆలస్యం’ ఎ. అజ శర్మ, ( రచయిత ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ) ,ప్రజాశక్తి , Oct 21,2018

239 Comments

Filed under Uncategorized

IT దాడులు -నిజాలు !!!

IT దాడులు -నిజాలు !!
ఇండియా లో పోయిన సంవత్సరం 1150 Income Tax( IT) రైడ్ లు జరిగాయి.ఈ ఏడాది ఇప్పటివరకు 650 IT రైడ్ లు జరిగాయి
మిగిలిన రాష్ట్రాల వారు ఎవరూ మా రాష్ట్రం మీద దాడి అనలేదు కదా
-AP 24 /7 జర్నలిస్ట్ సాయి, Oct 15

(బీహార్ BJP డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సొంత తమ్ముడి మీద కూడా IT దాడులు జరిగాయి .

కర్ణాటక కాంగ్రెస్ మాజీ సీఎం SM కృష్ణ బీజేపీ లో చేరిన సంవత్సరం తరువాత అయన అల్లుని మీద IT దాడులు జరిగాయి అని మరిచి పోకూడదు .

YCP నుంచి TRS లో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి మీద కూడా పోయిన నెల IT దాడులు జరిగాయి

2016 లో టీడీపీ బీజేపీ తో భాగస్వామిగా ఉన్నప్పుడు ముగ్గురు TDP నాయకుల ల మీద ( MLA DK సత్య ప్రభ , MLA మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , MLC వంటేరు వేణు గోపాల్ రెడ్డి) IT దాడులు జరిగాయి కానీ నాడు ఏమీ అనలేదు టీడీపీ

ఇప్పుడు TDP MP CM రమేష్ , MP సుజనా చౌదరి, MLA పోతూరి రామారావు ,బీద మస్తాన్ రావు ల మీద IT దాడులు జరిగితే గగ్గోలు పెడుతున్నారు.

సుజానా చౌదరి CM రమేష్ లు నిప్పు బాబు కుడి ఎడమ భుజాలు మరి !!!

కానీ ఇది మా నిప్పు బాబు మీద దాడి అని బాబు కులస్తులకు చెందిన TV5 ABN మహా న్యూస్ అంటాయి

5 Comments

Filed under Uncategorized

అమరావతి బ్రాండ్‌ నుంచి బాండ్ల వరకూ!

అమరావతి బ్రాండ్‌ నుంచి బాండ్ల వరకూ!
-తెలకపల్లి రవి ( ప్రముఖ రాజకీయ విశ్లేషకులు)
‘అమరావతి భ్రమలు- వాస్తవాలు’ వ్యాసాల పరంపరలో మొదటిది

‘.ఈ సమయంలో రాజధాని కట్టాలంటే కేంద్రం నిధులు ఇవ్వాలి. లేదా అప్పు తీసుకురావాలి. అప్పు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సింగపూర్‌, చైనా, జపాన్‌, కొరియా దేశాల సహకారంతో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. నా పేరు చెబితే ఆ దేశాలే ముందుకొస్తున్నాయి. అదీ నా క్రెడిబిలిటీ’ -అమరావతి భూమిపూజలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫిబ్రవరి17, 2016)

‘అమరావతి బాండ్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయంటే అదీ మా ప్రభుత్వంపై వున్న నమ్మకం’ -ముంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో అమరావతి బాండ్ల విక్రయ సభలో చంద్రబాబు నాయుడు (ఆగష్టు 28, 2018)

2014 జూన్‌ 2న ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టం మేరకు కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే రాజధాని రాజకీయం ప్రారంభమైంది.

రాష్ట్రానికి తప్పని సరి అవసరమైన రాజధాని ఎంపిక నిర్మాణంలో ఏదో మహత్యం ఇమిడి వున్నట్టు ప్రచారం సాగుతోంది. రాజధాని స్థల నిర్ణయం, అమిత జాప్యంతో సాగే నిర్మాణం రాజకీయ ప్రచారాస్త్రంగానే గాక ఆర్థిక ప్రయోజనాల సాధనంగానూ మారింది. మొదట్లో దోస్తులుగా వున్నందుకు బిజెపి దేశభక్తి తరహా టిడిపి రాష్ట్రభక్తికి రాజధానిని సంకేతంగా చేశారు.

విరాళాల వసూలే గాక అయోధ్య తరహాలో ఇటుకలు ఆన్‌లైన్‌ ఇటుకలు సమీకరించడం రసవత్తర ఘట్టమైంది.

2015లో శంకుస్థాపనకు అన్ని చోట్ల నుంచి మట్టీ నీరు తెప్పించడం, ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ కూడా మట్టి నీరు ఇచ్చి నిర్దిష్ట హామీ లేకుండా నిష్క్రమించడం ఒక ప్రహసనమైనా అప్పట్లో ప్రశంసలే కురిపించారు.

నిర్ణయ ప్రకటన ముందు నుంచీ సింగపూర్‌ రాకపోకలు ముమ్మరంగా నడిపి సర్వం వారికి అప్పగించడమూ జరిగిపోయింది. భూవ్యాపార లావాదేవీలూ జోరందుకున్నాయి. డిజైన్లు, చర్చలు, గోష్టులు భూములిచ్చిన రైతుల భూమిలేని పేదల ఆందోళనలూ రకరకాల ప్యాకేజీలు, మధ్య మధ్య కోర్టుల తీర్పులూ వామపక్షాల ఉద్యమాలు, ప్రతిపక్షం విమర్శలూ, ప్రభుత్వం ఎదురుదాడులూ హోరాహోరీగానే నడుస్తున్నాయి.

ఇన్నిటి మధ్యనా సిఆర్‌డిఎ పేరుతో సర్వము తానైనవాడెవ్వడు అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన విశ్వాస పాత్రుడైన మంత్రి నారాయణ తదితరులు పర్యటనలూ ప్రకటనలతో సందడి నిలబెట్టడానికి తంటాలు పడుతున్నారు.

ఇప్పుడైతే అప్పుల కోసం అమరావతి బాండ్ల అమ్మకం ఘనతగా చెబుతున్నారు. అమరావతి ప్రపంచం లోని అయిదు గొప్ప నగరాలలో ఒకటిగా తయారవుతుందని ముఖ్యమంత్రి పదేపదే చెప్పడంతో నా అలవాటు ప్రకారం ‘ఇది భ్రమరావతి’ అన్నాను. దానిపై అప్పుడు దుమారం రేగింది గాని అందరూ ఆ మాట స్వీకరించారు. చట్టబద్దమైన రాజధానిగా అమరావతి వేరు. దాని చుట్టూ అల్లిన అతిశయాలతో కూడిన భ్రమరావతి వేరు.

అమరావతి ఎంపికనూ ఎవరూ అడ్డుకున్నది లేదు. విమర్శలూ ఉద్యమాలూ రాలేదా అంటే వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. దానికి కారణం రాజధాని పేరు చెప్పుకుని రాజకీయ బేహారులు సాగించిన వాణిజ్య క్రీడలే.

అవసరాన్ని మించిన భూ సమీకరణ చేసి ఆలస్యమవుతున్నా నిర్మాణ వేగం పెంచని చంద్రబాబు ప్రభుత్వ ధోరణి అందులో భాగమే. ఈ క్రమంలో దారుణంగా నష్టపోతున్నది పేద మధ్యతరగతి వర్గాలు. వారి జీవితమూ హక్కులే నలిగిపోతున్న స్థితి.

పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ అంశాల మధ్య 21వ శతాబ్దపు రాజకీయముంది.

తెలుగుదేశం నాయకత్వం నుంచి వారి మద్దతుదారులైన వాణిజ్యవేత్తల నుంచి అంతర్జాతీయ పెట్టుబడి వరకూ విస్తరించిన రాజకీయమది.

రాజధాని నిర్మాణం తెలుగుదేశం నాయకత్వానికి, మద్దతుదారులకు బాగా లాభ దాయకంగా వుండేట్టు చూడటం చంద్రబాబు రాజకీయ అవసరం. హైదరాబాదు వంటి చోట్ల అన్ని వ్యాపారాలు చేసి లాభాలు పోగుపోసుకున్న వారికి అందుకు దీటైన బంగారు గనిగా రాజధాని కనిపించింది.
అయితే దాని నిర్మాణమంతా పూర్తయిన తర్వాత లాభాలు వస్తాయంటే వారు ఆగరు. కట్టే క్రమంలోనే వారిని తక్షణం సంతృప్తి పర్చాలి. కట్టడం కన్నా ఇది మరింత ముఖ్యం.
2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించ డానికి వారి అండదండలు చాలా అవసరం.

రాజధాని విషయమై నియమితమైన శివరామ కృష్ణన్‌ కమిటీ సిఫార్సులు ..పర్యావరణ నిపుణులు, పట్టణీకరణ నిపుణులు చెప్పే సూత్రాలు అనుకూలంగా లేవు గనక తీసిపారేయాలి.

నూజివీడు, మంగళగిరి వంటి చోట్ల 50వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూములున్నాయి. కాని వాటిలో రాజధాని కట్టేసే వాణిజ్య వర్గాలకు ఏం లాభం?

కృష్ణాతీరంలో భూములు ఇప్పటికే ఎకరం రూ.రెండు కోట్లు వుంది. అంత పెట్టి కొంటే అస్మదీయులకు లాభం వుండదు.

ప్రైవేటు భూములతో ప్రైవేటు శక్తులతో ప్రైవేటు నమూనా నడవాలి. రైతుల భూములు చవగ్గా తీసుకుని భారీ రేట్లకు అమ్ముకోవాలి.

రాజధాని ఎక్కడో చెప్పేస్తే లేదా చర్చకు పెడితే అందరికీ తెలిసిపోతుంది. ఈ ఉద్దేశంతోనే ముందుగా మంగళగిరి, నూజివీడు, గన్నవరం అంటూ అనేక కథనాలు ప్రచారం పెట్టారు. అక్కడంతా టిడిపి కేంద్ర మంత్రులూ రాష్ట్ర మంత్రులూ స్థానిక నాయకులు రంగంలోకి దిగి పోటాపోటీగా భూములు కొనడం మొదలెట్టారు. రాజధాని ప్రకటన తర్వాత నిబంధనలు మారిపోతే మీకు మొదటికే మోసమని వారిని భయపెట్టారు. రాజధాని వస్తే ధరలు ఏక్‌దమ్మున కోట్లలోకి పెరిగిపోతాయని ఆశ చూపించారు. అసైన్డ్‌ భూముల రైతులనైతే మీకు ఎలాంటి హక్కులూ వుండవని బెదిరించి కారుచౌకగా కొట్టేశారు. దాదాపు ఆరేడు నెలల పాటు ఈ దందా విచ్చల విడిగా నడిచింది. ప్రభుత్వం ఊహాగానాలకు వూతమిస్తూ స్థానికులలో అభద్రత సృష్టించింది. వారు మరింత అమ్ముకునేలా చేసింది. తమ ఉద్దేశం వ్యూహం నెరవేరాయని సంతృప్తి చెందిన తర్వాతనే ప్రభుత్వం అధికారికంగా రాజధాని ఎక్కడో చెప్పింది. అప్పుడు కూడా నిర్దిష్టమైన బిందువు చెప్పలేదు. ఈ అయోమయంలో అమ్మకాలు పెరిగాయి.

రాజధాని ప్రాంతంలో భూ యాజమాన్య స్వరూపం మారింది. దళితులు నిరుపేదలూ తమ భూములు ఘరానా బాబుల చేతుల్లో పెట్టేశారు.

ఆ ప్రాంతంలో నీటి వసతి లేని మెట్ట భూములు ఇవ్వడానికి రైతుల్లో చాలా భాగం సిద్ధంగా వున్నారు. కానీ మూడు పంటలు పండే జరీబు భూములను కూడా తీసుకోకుండా వదల్లేదు.
నదీ ముఖద్వార పర్యాటకం పేరిట ఆ భూములతో వ్యాపారం చేసుకోవడం లక్ష్యం. ఎంత ఒత్తిడి తెచ్చినా ఉండవల్లి, పెనుమాక వంటి చోట్ల రైతులు జరీబు భూములు ఇవ్వక పోవడం గమనార్హం.

వీరిలో ఎక్కువ మంది ఇవ్వకపోవడానికి కారణం కూడా రేపు పెరిగే రేట్లు పొందాలన్న ఆలోచన తప్ప రాజధాని వద్దని కాదు. రాజధాని రావాలి, మా భూములు తీసుకోకూడదని కోరుకున్నవారు చాలామందే వున్నారు. ఆ మాటకొస్తే టిడిపికి చెందిన చాలా మంది ప్రముఖులు భూములివ్వలేదు. పైగా కొనుక్కు న్నారు.

దీన్ని ప్రతిపక్షాలు ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ అన్నాయి. దానిపై ముఖ్యమంత్రి విరుచుకు పడటమే కాదు. భూములు కొంటే తప్పేమిటని శాసనసభలో అధికారికంగా వాదన చేశారు. ఈ దశలో ఇదో విధమైన తలకిందులు దేశభక్తిగా మారింది. వీరంతా సన్నిహితుల పేర్లతో వ్యాపార సంస్థల పేర్లతో కొన్నది బయిటకు రాలేదు. రాజకీయవేత్తలే గాక సూపర్‌ స్టార్లు కూడా వెంచర్లు మొదలు పెట్టారు.

అంతేగాక రాజధాని కట్టేలోగా విజయవాడలో ప్రభుత్వ సభలూ కార్యక్రమాలు జరగాలి. వాటికి పాలక పక్షీయుల హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు భారీ రేట్లతో తీసుకోవడం పరిపాటిగా మారింది. ఒకటి రెండు హాళ్లు కట్టుకోవడం నిజానికి ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఇలాంటి వారి ప్రైవేటు భవనాలలోనే ఏర్పాటు చేయడం వల్ల అద్దెలు అడ్వాన్సుల రూపంలో బోలెడు లాభం ముట్టచెప్పడంతో అమరావతి వ్యవహారం పొడుగు చేతుల పందేరంగా మారింది.

ఈ ప్రయోజనం పొందిన వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ప్రభుత్వ యంత్రాంగంలో ప్రధాన భాగంగా వుండటం విమర్శలను పెంచింది.

ఇప్పుడు ఈ ప్రభుత్వం పదవీ కాలం ముగింపునకు వస్తుంది గాని తాత్కాలిక సచివాలయం, శాసనసభ సముదాయం తప్ప చెప్పుకోదగిందేదీ అక్కడ రాలేదు.

అది గాక ఎస్‌ఆర్‌ఎం విట్‌ ప్రైవేటు విద్యా సంస్థల భవనాలు వుంటాయి. రకరకాల రోడ్ల నిర్మాణాలు నడుస్తున్నాయి. కొన్ని నివాస సముదాయాల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

రైతుల దగ్గర రకరకాల రూపాలలో సమీకరించిందీ, ప్రభుత్వ భూమి పేరిట కలిపేసుకున్నదీ మొత్తం యాభై వేల ఎకరాలకు పైగా పోగు వేయడంలో చూపిన శ్రద్ధ తదుపరి దశలో కనిపించలేదు.

అధికారుల ఒత్తిడి తో పండించడం మానేసిన పొలాలు ఒకవైపు. పనుల కోసం పక్క ఊళ్లకు పరుగులు తీసే శ్రామికులు మరోవైపు. మిగిలిన వారితో వ్యాపారాలు చేసుకుంటున్నవారు ఇంకొక వైపు దర్శనమిస్తున్నారు.

2015 సెప్టెంబరు 4న శాసనసభలో చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేశారు. అంటే అక్షరాలా నాలుగేళ్లు పూర్తయ్యాయి. భూ సమీకరణ నోటిఫికేషన్‌ ఆ ఏడాది చివరలో విడుదలైంది. తర్వాత పదే పదే శంకుస్థాపనలు, ఈవెంట్లు, అంతర్జాతీయంగా తనకున్న బ్రాండ్‌ ఇమేజి వల్ల చాలా పెట్టుబడులూ పరిశ్రమలూ వస్తాయన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల నుంచి అప్పులు సేకరించడం కోసం అమరావతి బాండ్లు విడుదల చేస్తున్నారు. ఇవి వెంటవెంటనే అమ్ముడు పోవడం తన బ్రాండ్‌ ఇమేజి అని ఇప్పుడంటున్నారు. ఈ రెంటికి మధ్య పరిణామాలు చెప్పేదేమిటి?

Source-అమరావతి బ్రాండ్‌ నుంచి బాండ్ల వరకూ! ప్రజాశక్తి ,Sep 5,2018

56 Comments

Filed under Uncategorized

TDP కంచుకోటకు బీటలు

TDP కంచుకోటకు బీటలు! ఆంధ్రభూమి, July 23,2018
శ్రీకాకుళం: సరిగ్గా 2004 సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులే ఉత్తరాంధ్రలో ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరాయి. అందులో టీడీపీ కంచుకోట, అధికారాన్ని అందిపుచ్చుకునేందుకు సెంటిమెంట్ జిల్లా శ్రీకాకుళంలో టీడీపీ జయాపజయాలు ఫిఫ్టీ-్ఫఫ్టీ కంటే బలహీనంగా ఉంటాయన్న సర్వేలు ఆ పార్టీ అధిష్ఠానానికి హైబీపీ తెప్పించింది.

ఉత్తరాంధ్రలో అధికార పార్టీ అపజయాలకు అద్దంపట్టే ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలు, వలసలు పెరిగిపోవడం, రైతాంగం సాగునీరులేక అల్లాడడం, నిరుద్యోగం, యువత నిరాశలో ఉండడం వంటివి టీడీపీకి పెనుగండంగా మారనున్నాయి.

రైల్వేజోన్ వస్తే ఉపాధి వచ్చేది, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ వస్తే పరిశ్రమలు వచ్చేవి… ఏవీ లేకపోవడంతో టీడీపీకి దెబ్బ తప్పదంటున్నారు.

2004లో కాంగ్రెస్‌కి ఈ జిల్లాలు ఇరవైకి పైగా అసెంబ్లీ సీట్లు ఇచ్చి పీఠం మీద కూర్చొపెట్టిన సీన్ రీపీట్ అవ్వడం ఖాయమంటూ రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సైకిల్‌కి ఎక్కడిక్కడ పంచర్లు పడ్డాయి… శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నం వరకూ అంతా రిపేర్లే అంటూ హెచ్చరికలను బాబు ప్రైవేటు సర్వేలు చెబుతునే ఉన్నాయి.

అధికార పార్టీ నాలుగేళ్ళ పాలన వ్యతిరేకతను బాగా పోగేసింది. చెప్పిన మాటలూ, ఇచ్చిన హామీలు ఈ జిల్లాల్లో సకాలంలో నెరవేర్చకపోవడంతో తిరుగుబాటు మొదలైందంటున్నారు.

బీసీలు, పేదలు ఎక్కువగా ఉన్న చోటనే అధికార పార్టీకి ప్రమాదఘంటికలు అంటూ రాజకీయ ప్రైవేట్ సర్వేలు సుస్పష్టంగా చెబుతున్నాయి. అందుకే, గత ఎన్నికల్లో లెక్కే మారుతుందన్న అనుమానాలు బాబులో కన్పిస్తున్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా చెప్పుకొస్తున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో మిత్రపక్షం బీజేపీ ఒక సీటు కూడా కలుపుకుని పాతిక ఎమ్మెల్యేలను టీడీపీ ఖాతాలోకి చేరాయి. అలాగే, ఐదు ఎంపీ సీట్లులో నాలుగు సునాయాసంగా గెలుచుకుని, వైసీపీ నుంచి అరుకు ఎంపీ గీతను లాగేసి ఐదు ఎంపీలుగా తనవేనని టీడీపీ చెప్పింది. అలాగే, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుని మొత్తంగా 29 ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర టీడీపీ బలంగా పేర్కొంది. అంటే, రానున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ ఉత్తరాంధ్రలో బలంగా ఉండాలి. కానీ, ఆ పరిస్థితులు కన్పించడం లేదంటున్నారు.

ఈసారి ఉత్తరాంధ్రలో టీడీపీ భారీ షాక్ తగిలేలా ఉందని, పోయిన ఎన్నికల్లో ఎనభైశాతం పైగా సీట్లును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాపు, వెలమ, కళింగ వంటి బీసీలు బాగా ఉన్న ఈ జిల్లాల్లో టీడీపీ అంటే ముఖంచాటేసుకునేలా మారారు.
బాబు ముఖ్యమంత్రి కావడానికి మద్దతు ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు ఓటు మారిస్తేగాని మా రాత మారదన్న నిశ్చయానికి వచ్చారు.

ఇక్కడ ఐదుగురు మంత్రులు ఉన్నారు. అందరూ సీనియర్లు.. గండర గండర్లే! కానీ, తాజా రాజకీయ వాతావరణం మాత్రం వీరంతా డేంజర్ జోన్‌లో ఉన్నారంటూ సంకేతాలు వెలుగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి ఓడిపోయేది ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి అని ఇంటెలిజెన్స్ నివేదికలు సుస్పష్టం చేస్తున్నాయి. సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తూన్న కళా పనితీరు కూడా ఆయన ఓటమి అంచున నిలబెట్టాయని అంటున్నారు.

ఇక మరో మంత్రి అచ్చెన్నాయుడు పెద్దగళాన్ని విస్తారంగా విప్పేసి విపక్షాలపై విరుచుకుపడే నైజం ఆయనను రాష్ట్రంలోనే ఇమేజ్ పెంచింది. కానీ, టెక్కలి ఓటర్లు ఆయనను వ్యతిరేకిస్తున్నారన్న వాస్తవం ఇప్పుడిప్పుడే బయటపడుతుందంటున్నారు. ఈయనకు సరైన ప్రత్యర్థిని వైసీపీ వెతుకుతోంది. మాజీ కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి వంటి నేత అచ్చెన్నపై పోటీకి దిగితే ఆయన గెలుపు కూడా కష్టమేనంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు బాబువద్దకు చేరాయి.

విజయనగరం జిల్లాలో ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణరంగారావుకి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆ జిల్లా అంతటా వైసీపీ స్వీప్‌గా విజయాన్ని సాధిస్తుందన్న సంకేతాలైతే ప్రజల నుంచి వున్నాయి. ఇక్కడ మంత్రి ఫిరాయింపే ఆయనకు పెద్ద మైనస్.

విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మంత్రుల తీరూ అలాగే ఉంది. అయ్యన్నపాత్రుడు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవన్నది సుస్పష్టం. అందుకే, ఆయన బరిలోకి దిగరన్నది పబ్లిక్ టాక్.

మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల కాలంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన భీమిలి అసెంబ్లీలో విజయం దక్కదన్నది సర్వేలు తేల్చిచెప్పేశాయి.

ఇలా… ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐదుగురు మంత్రులకూ విజయం తథ్యమన్న ధీమా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని గెలుస్తామన్న అంచనాల్లో బాబు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో పంద్రాగస్టు పండుగ వేదికగా శ్రీకాకుళాన్ని ఎంచుకుని ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ విజయానికి కావల్సిన రిపేర్లు చేసేందుకు కసరత్తు ప్రారంభిస్తారన్నది సీఎంవో కార్యాలయం నుంచి అందిన సమాచారం!

34 Comments

Filed under Uncategorized

కొత్తగా ఈ ‘1500 రోజుల పండగ’ ఏంది బాబూ!

ఈ ఏడాది జూన్ నెలలోనే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పునరంకిత దీక్షలు..సభల పేరుతో కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేశారు. మళ్ళీ దీని కోసం పత్రికలు, టీవీల ప్రకటనలపై పెట్టిన ఖర్చు కూడా కోట్లలోనే. ఎవరైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొలి వంద రోజులు…ఏడాది పూర్తయిన తర్వాత వార్షికోత్సవాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు. ఇది ఏ పార్టీ ఉన్నా చేస్తూనే ఉంటుంది. గత నెలలోనే తెలుగుదేశం సర్కారు నాలుగేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. అందుకే పునరంకిత సభలు..కార్యక్రమాలు అంటూ ప్రజాధనంతో వారం రోజుల పాటు హంగామా చేసింది. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను విస్మరించి…జూన్ 2 నుంచి 8 వరకూ ఇలా కార్యక్రమాలు చేయటం ఏమిటి అనే విమర్శలు ఉన్నా…చంద్రబాబు వాటినేమి పెద్దగా పట్టించుకోవటం లేదు.

కానీ ఇఫ్పుడు కొత్తగా ‘1500 రోజుల ప్రగతి’ పేరుతో పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చి పండగ చేసుకుంటున్నారు. జూన్ లోనే వారం రోజుల పాటు ఈ నాలుగేళ్లలో తానేమి చేసింది చంద్రబాబు ప్రజలకు వారం రోజుల పాటు ‘చెవుల్లో తుప్పు వదిలేలా’ విన్పించేశారు. ఇది జరిగిన 40 రోజుల్లోనే కొత్తగా చెప్పటానికి చంద్రబాబు సాధించింది ఏమిటి?. అంటే ఏమీ లేదు.

చంద్రబాబుకు ప్రచారం చేసుకోవటానికి..ప్రజల డబ్బుతో పేజీలకు పేజీలు యాడ్స్ ఇవ్వటానికి ఓ కారణం కావాలి. అంతే…అదే 1500 రోజుల పండగ. ఓ వైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా..బ్రిడ్జిలు లేక ప్రజల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నా పట్టించుకోని చంద్రబాబు ఏదో కార్యక్రమం వెతుక్కుని ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. సర్కారు నిర్లక్ష్యంగా కారణంగా ఏ ప్రమాదంలో ఎవరు చనిపోయినా ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవటం తప్ప…శాశ్వత నివారణ చర్యలు శూన్యం. గత కొంత కాలంగా ఏపీలో జరుగుతున్న పడవ ప్రమాదాలే దీనికి ఓ ఉదాహరణ. ఇందులో సర్కారు నిర్లక్ష్య ధోరణి, కొంత మంది నేతల డబ్బు కక్కుర్తి..అధికారుల అలసత్వం కలసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఓ వైపు గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతైన పిల్లల ఆచూకి తెలియక ఆ తల్లిదండ్రుల ఆందోళన అలాగే కొనసాగుతుండగానే…చంద్రబాబు మాత్రం ఇలా ప్రజల సొమ్ముతో ‘పండగలు’ చేసుకుంటున్నారు.

http://telugugateway.com/2018/07/chandrababu-new-trend-1500-days-festival/

8 Comments

Filed under Uncategorized